పవిత్ర భావనతో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రభుత్వం బాగా చేసిందన్న భావన ప్రతి ఒక్కరిలో రావాలని, అందుకోసం స్ఫూర్తితో పని చేయాలని, విధి నిర్వహణలో అలక్ష్యం ఉండకూడదని, క్రమశిక్షణతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1020 మంది అధికారులకు, సిబ్బందికి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేసారు. తొలిరోజు పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని కితాబిచ్చిన చంద్రబాబు, మిగిలిన రోజులలో కూడా అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య చర్యలు సజావుగా చేపట్టాలని అన్నారు.
నీళ్లలో వ్యర్థాలను తొలగించేందుకు వలలు వినియోగించాలని, పుష్కర్ నగర్ లు, రహదారులపై చెత్త లేకుండా చూడాలని, పుష్కర ఘాట్ల వద్ద పారిశుద్ధ్య బాధ్యతలను అగ్నిమాపక సిబ్బంది, నీళ్లలో పారిశుద్ధ్య బాధ్యతలను మత్స్య శాఖ సిబ్బంది చూడాలని అన్నారు. ఎక్కడా వ్యర్థాలు పోగవకుండా చూడాలని, ప్రతి ఘాట్ వద్ద వాటర్ లెవెల్ ఇండికేటర్లు ఏర్పాటు చేయాలని, నీటి మట్టం లోతు తెలిస్తేనే యాత్రికులు అప్రమత్తంగా ఉంటారని, సెలవు రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి చంద్రబాబు హితబోధ చేసారు.
కృష్ణానదిలో నీళ్లు బాగా లేవు, బ్యాక్టీరియా ఉందనే దుష్ప్రచారం జరుగుతోందని, దీనిని అధికారులు, సిబ్బంది ఖండించాలని తెలిపారు. స్వామీజీలు, పీఠాధిపతులు పుష్కర స్నానం చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని చంద్రబాబు కోరారు. ప్రభుత్వ సదుపాయాల వివరాల బోర్డులను అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని, పుష్కర ఏర్పాట్లపై ప్రజల్లో వంద శాతం సంతృప్తి నెలకొనాలన్నారు. పుష్కర స్నానానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు హోంగార్డులు సాయపడాలని, గజ ఈతగాళ్లందరూ అప్రమత్తంగా ఉండాలని, వంతెనల వద్ద పోలీస్ పహారా ఉండాలని, పిండ ప్రదానం అధికంగా జరిగే ఘాట్ల వద్ద టెంట్లు విస్తృతంగా ఏర్పాటు చేయాలని పలు సూచనలు చేసారు.