అమరావతిని విచ్ఛిన్నం చేసే కుట్రలను ఎదురుకోవడానికి సన్నద్ధం అవుతుంది ప్రతిపక్షం. తెలంగాణ సమయం నాటి రెండు కళ్ళ సిద్ధాంతం కాకుండా ఈ సారి చంద్రబాబు స్పష్టమైన వైఖరి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా అమరావతికి భూములిచ్చిన రైతుల పక్షాన నిలవాలని ఆయన నిర్ణయించినట్టు సమాచారం.
ఈ నెలలోనే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని, అమరావతి పరిరక్షణ సమితి, రైతులు, అందరితో కలిసి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ని కలవడానికి సిద్ధం అవుతున్నారు. తొందరలో వారి అప్పాయింట్మెంట్ కోరబోతున్నారని సమాచారం.
ఎన్నికల ఓటమి తరువాత చంద్రబాబు ప్రధానిని కలవలేదు. టీడీపీ ఎన్డీయే నుండి బయటకు వచ్చాకా, ఎన్నికల ప్రచారం సమయంలో ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరిగింది. బద్ద రాజకీయ విరోధుల లాగా ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ తరుణంలో వారి మొదటి భేటీ ఆసక్తికరంగా మారనుంది. మరోవైపు బీజేపీ నాయకులు ప్రధాని చంద్రబాబుకి అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వకూడదని ఒత్తిడి చేస్తారట.
మరోవైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా హై పవర్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షాలను కలిసి వారికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీదా, అమరావతిని ఎందుకు కొనసాగించలేకపోతున్నాం అనే దాని మీద వివరణ ఇచ్చి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చెయ్యాలని భావిస్తున్నారట.