ఎన్నికల తరువాత మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అనుకున్న దానికంటే బెటర్ గానే పెర్ఫర్మ్ చేస్తుంది. 23 ఎమ్మెల్యేలే ఉన్నా ప్రభుత్వాన్ని బానే ప్రశ్నిస్తున్నారు. కియా వివాదం తెర మీదకు తెచ్చి అధికారపార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అయ్యింది. దీనితో చంద్రబాబు నాయుడు మొహం మీద మొట్టమొదటి సారిగా ఆనందం వెల్లివిరిసింది. అసెంబ్లీలో ఆయనలో జోష్ పెరిగినట్టు కనిపించింది. ఈరోజు బుగ్గన మీద సెటైర్లు వేసిన చంద్రబాబు, స్పీకర్ మీద కూడా ఛలోక్తులు విసిరారు.
ప్రతిపక్షపార్టీకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్లపై వైఎసార్సీపీ ప్రభుత్వ వైఖరి వినిపించే సందర్భంలో తనను, తమ పార్టీని విమర్శించారని చంద్రబాబు స్పీకర్తో అన్నారు. అలాంటప్పుడు తమ వాదన చెప్పుకునే అవకాశం కూడా సభలో లేకపోతే బయటకు వెళ్లి చెప్పుకోవాలా అని స్పీకర్ ను చంద్రబాబు నిలదీశారు. ఆ అవకాశం కల్పించని పక్షంలో, ఇంక అసెంబ్లీకి ఎందుకు రావడం అని ఆయన ప్రశ్నించారు.
“మీ అటెన్షన్ కోసం పదేపదే వేలు చెయ్యి నొప్పి పెట్టే విధంగా పైకి ఎత్తుతున్నామని.. కానీ మీ మనసు మాత్రం కరగలేదు’ అని స్పీకర్తో చంద్రబాబు అన్నారు. తమ వైపు చూడటమే మానేస్తున్నారని స్పీకర్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకో తనకు అర్థం కావడం లేదని చంద్రబాబు చమత్కరించారు. అయితే.. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై స్పీకర్ కూడా నవ్వుతూ బదులిచ్చారు. పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ మీరటు చూస్తే అందంగా కనబడతారని అన్నారని, అందుకే అటు చూస్తున్నానని స్పీకర్ చెప్పుకొచ్చారు.