Chandrababu-Naidu-TDP-Kurnool-Andhra-Pradesh-TIDCO-Housesవైసీపీ కంచుకోట కర్నూల్ జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుదవారం పర్యటించినప్పుడు వేలాదిమందిగా జనాలు తరలివచ్చి ఆయనకు ఘనస్వాగతం పలకడం చాలా ఆసక్తికరమైన మార్పుగానే భావించవచ్చు. పత్తిపాడులో ప్రసంగిస్తూ, “సిఎం జగన్‌ తాను మీ పిల్లలకి మేనమామనని వారు బాగోగులు తానే చూసుకొంటానని చెపుతుంటారు. కానీ ఆయన కంసుడు వంటి మేనమామ. రాష్ట్రంలో 6,000 పాఠశాలలు మూసివేయించాడు. కొత్తగా ఒక్క పాఠశాల కట్టించలేదు. ఒక్క ఉపాధ్యాయుడిని నియమించకపోగా ఉద్యోగులను, ఉపాధ్యాయులను వేధిస్తున్నాడు. పీఆర్సీ, ఓపీఎస్ ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నాడు.

అయినా సొంత తల్లిని చెల్లిని పట్టించుకోనివాడు మిమ్మల్ని ఎందుకు పట్టించుకొంటాడు?ఆయనకి ఎప్పుడూ ఎక్కడ నుంచి ఎంత దోచుకొందామా? మళ్ళీ ఎన్నికలలో ఎలా గెలుద్దామా? అనే ఆలోచనలే చేస్తుంటారు తప్ప రాష్ట్రాభివృద్ధి అవసరం లేదు. ప్రజా సమస్యలను పట్టించుకోరు.

నేను కర్నూలులో 10,000 టిడ్కో ఇళ్ళు కట్టిస్తే వాటికి వైసీపీ రంగులు వేయించుకొని అవి తానే కట్టించానని సిఎం జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెప్పుకొంటున్నారు. ఇంతకంటే నీచమేమైనా ఉంటుందా?కర్నూలు పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశ్యంతో నేను ఆర్డీఎస్, వేదవతి, ఎల్లేల్సీ, గుండ్రేవులను అభివృద్ధి పనులు మొదలుపెడితే వాటిలో తట్టెడు మట్టి పోయలేదు కానీ కర్నూలుని న్యాయ రాజధాని చేస్తానని, అప్పుడు రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలను మభ్యపెడుతున్నారు. కర్నూలు అభివృద్ధి కోసం వంద కోట్లు ఇవ్వలేదు కానీ సాక్షి పేపరు కోసం వందల కోట్లు ప్రకటనలు ఇవ్వగలరు.

మంత్రులకు శాఖలు పంచిన్నట్లు ఇసుక మాఫియా ఒకరికి, మద్యం మాఫియా మరొకరికి, భూకబ్జాల మాఫియా మరొకరికి పంచేశారు. ఆయన అండదండలతో వైసీపీ నేతలందరూ రాష్ట్రంలో చెలరేగిపోతున్నారు. అందినకాడికి దోచుకొంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే సిఐడీ పోలీసులు వచ్చేసి ఎత్తుకుపోతుంటారు. కేవలం మూడున్నరేళ్ళలోనే సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వ్యవస్థలన్నిటినీ భ్రష్టు పట్టించేశారు.

జగన్‌కి భయపడి తప్పులు చేస్తున్న అధికారులందరినీ నేను హెచ్చరిస్తున్నాను. ఇకనైనా సక్రమంగా మీ డ్యూటీలు మీరు చేయండి. కాదని అతి ప్రదర్శిస్తే నేను ముఖ్యమంత్రికాగానే తప్పక చర్యలు తీసుకొంటాను. ఇదివరకు జగన్‌ని నమ్ముకొన్నవారందరూ జయలుకి వెళ్ళి వచ్చారు. మళ్ళీ అదే జరుగుతుందని మరిచిపోవద్దు.

ఇక నా పర్యటనలని అడ్డుకోవడానికి వైసీపీ నేతలు రాళ్ళే వేయించినా, బూట్లే వేయించినా భయపడేది లేదు వెనక్కి తగ్గేదేలేదు. రౌడీ మూకల్లా చెలరేగిపోతున్న వీరందరికీ ముక్కుతాడు వేయాలంటే రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి రావలసిందే. కనుక గడప గడపకి వచ్చే మాయగాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.