chandrababu Naidu TDP - 2019 Elections‘త్వరలోనే ఈ ప్రభుత్వం పడిపోతుంది… ఎన్నికలు వస్తాయి… ఆ తర్వాత ఏర్పాటు కాబోయేది మన ప్రభుత్వమే…” అంటూ గడిచిన మూడేళ్ళ కాలంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి మెజారిటీ పరంగా ఎలాంటి డోకా లేకపోవడంతో, 2019 వరకు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కానీ, తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నోటి వెంట కూడా ముందస్తు ఎన్నికలు మాటలు రావడం విశేషం.

చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ‘ఏపీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని’ వ్యాఖ్యానించారు. అయితే ఏ సందర్భంలో కూడా వస్తాయో తెలిపారు. దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్లానింగ్ చేస్తున్న నేపధ్యంలో… ఆంధ్రప్రదేశ్ కు కూడా ముందస్తుగా ఎన్నికలు రావచ్చని, దీనికి అందరూ సమాయత్తమై ఉండాలని, ఇతర పార్టీల నుండి వచ్చిన వారితో సమన్వయంతో మెలగాలని, కలిసికట్టుగా సాగితే మనదే విజయం అంటూ చంద్రబాబు ప్రసంగించారు.