chandrababu naidu strong comments on jagan governmentనాన్న బుడ్డీతోనే అమ్మఒడి… అమ్మఒడితో నాన్న బుడ్డీ? కాస్త తికమకగా ఉందా? అమ్మఒడి పధకంలో వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము నాన్న బుడ్డీ (మందు)కే సరిపోతోందని టిడిపి వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దీనిలో మరో కొత్త పాయింట్ చెప్పారు. అదే.. నాన్న బుడ్డీతోనే అమ్మఒడి! వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం అమ్ముతూ భారీగా ఆదాయం సమకూర్చుకొంటూ దానిలో నుంచే అమ్మఒడికి నిధులు కేటాయిస్తోందని క్లుప్తంగా చెప్పారు. నిజమే కదా?

చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకానివారే కులాల గురించి మాట్లాడుతారు. వైసీపీ ప్రభుత్వం నాపై కమ్మ ముద్ర, పవన్‌ కళ్యాణ్‌పై కాపు ముద్ర వేసి దుష్ప్రచారం చేస్తోంది. రేపు తనను రెడ్డి కులస్థులు వ్యతిరేకిస్తే వారిపై కూడా కులం ముద్ర వేసి దుష్ప్రచారం చేసినా ఆశ్చర్యం లేదు.

నేను ఏ కులంవారికి మేలు చేయాలని హైదరాబాద్‌కు ఐ‌టి కంపెనీలు తీసుకువచ్చాను?ఎవరి కోసం వెనుకబడిన అనంతపురానికి కియా కంపెనీ తెచ్చాను? నా కుప్పం నియోజకవర్గంలో నా కులానికి చెందినవాళ్ళు గట్టిగా వందమంది కూడా లేరు. అయినా అన్ని కులాల ప్రజలు నన్నే ఎందుకు గెలిపిస్తున్నారంటే నేను ఎన్నడూ కులమతాలను పట్టించుకోకుండా అందరినీ సమానంగా చూసి గౌరవిస్తాను గాబట్టే కదా?

ఆనాడు నేను హైదరాబాద్‌కు తెచ్చిన ఐ‌టి కంపెనీలలో అన్ని కులమతాలవారు, అన్ని రాష్ట్రాలవారు ఉద్యోగాలు చేసుకొంటున్నారు కదా?కానీ సిఎం జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి చేయడం, సంపద సృష్టించడం రెండూ చేతకావు. అందుకే కులాల పేరుతో ప్రజల మద్య చిచ్చుపెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎవరైనా వైసీపీ నాయకుడు కులం గురించి మాట్లాడితే చెప్పు చూపించండి.

అప్పులు చేస్తూ ఇంకా ఎంతకాలం ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని నడిపించగలరో జగన్ రెడ్డి చెప్పాలి. భవిష్యత్‌లో ఎక్కడా అప్పులు పుట్టకపోతే అప్పుడు రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారో జగన్ రెడ్డి చెప్పాలి. తన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవాళ్ళను పోలీసులతో వేదించడం అడ్డువస్తే హత్యలు చేయించడం ఇదేనా పరిపాలన? వైసీపీ నేతలకు బొత్తిగా సంస్కారం, ఆలోచన, దూరదృష్టి లేదు. అందుకే మూడేళ్ళలో రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు మనకు కావలసింది ఈ కులాలు గొడవలు కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని సంపద సృష్టించుకోవాలి. ఈ అప్పుల బాధ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలి. కనుక రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ ఈ దిశలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయ చైతన్యం లేని ప్రజలను అందరూ దోచుకొనేందుకే ప్రయత్నిస్తుంటారు,” అని చంద్రబాబు నాయుడు హితవు పలికారు.