Chandrababu-Naidu-and-Jagan PRCవైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ శరవేగంగా జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో అవినాష్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చంటూ మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తుండగా, సీబీఐకు వ్యతిరేకంగా వైసీపీ వర్గాలు సరికొత్త కధనాలను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన చంద్రబాబు సీఎం జగన్ పై సెటైర్లు వేసారు.

రాజకీయ లబ్ది కోసం అబద్ధాలు ఆడడంలో జగన్ మోహన్ రెడ్డి ప్రపంచానికే ఆదర్శం అంటూ పంచ్ పేల్చారు. బాబాయ్ ని హత్య చేయించి, హత్య చేయించిన వాళ్లకు అండగా ఉండి, దాన్ని తెలుగుదేశం పార్టీపైకి తోసే ప్రయత్నం చేసారు. హత్య చేసింది వాళ్ళు, ఆ రక్తపు మరకలు మన చేతికి అంటిస్తారు. ‘చేసింది గొడ్డలి పోటు – చెప్పింది గుండెపోటు’ అంటూ వైసీపీ వర్గాలను ఎండకట్టారు.

ఇలాంటి పనులు మేమెవ్వరమూ చేయలేము, అది ఒక్క జగన్ మోహన్ రెడ్డే చేయగలుగుతాడు. హత్యా రాజకీయాలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని, రావణాసురకాష్టం చేస్తున్నాడని, చనిపోయిన వారిని కూడా వదలకుండా వారి క్యారెక్టర్ ను కూడా దిగజార్చే ప్రక్రియ చేస్తున్నాడని ప్రస్తుతం వైసీపీ చెప్తోన్న వైఎస్ వివేకా రెండో పెళ్లి ప్రస్తావనపై చంద్రబాబు మండిపడ్డారు.

వాస్తవాలను పక్కనపెట్టి అబద్దాలు, అసత్యాలతో రాజకీయ లబ్ది పొందే విధంగా సమర్ధవంతంగా చెప్పిన వ్యక్తిగా జగన్ మోహన్ రెడ్డిని కీర్తించారు చంద్రబాబు. సొంత బాబాయ్ ని చంపి, ఆ హత్యా నేరం టీడీపీ మీద వేసి లబ్ది పొందిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటూ నాటి సంగతులను చంద్రబాబు నెమరువేసుకుని, జగన్ అసత్య ప్రచారాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేసారు.