Chandrababu naidu remembers about babli incidentగోదావరి నదిపై తెలంగాణ సరిహద్దు బాబ్లీ వద్ద మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టును ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాడు అడ్డుకున్న విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలతో పాటు కేంద్రం, న్యాయస్థానాల సూచనలను బేఖాతరు చేస్తూ మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినా, కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. దీంతో ప్రతిపక్షనేత హోదాలో ఉన్న చంద్రబాబు తన పార్టీ టీడీపీ నేతలతో కలిసి బాబ్లీ వద్దకు వెళ్లి, మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అక్కడ ధర్నాకు దిగే యత్నం చేశారు.

అయితే ఓ రాష్ట్రానికి పదేళ్ల పాటు సీఎంగా వ్యవహరించిన నేత అన్న కనీస మర్యాద కూడా లేకుండా మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆ రాష్ట్ర పోలీసులు… టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకరరావు తదితరులపై లాఠీలు ఝుళిపించడమే కాక చంద్రబాబు సహా అందరిని అరెస్ట్ చేసి, ఓ పాడుబడ్డ కళాశాల భవనంలోకి నెట్టేసిన ఉదంతం అప్పట్లో ఏపీ ప్రజల ఆగ్రహాన్ని చవిచూసింది. మన రాష్ట్రానికి చెందిన నేతను అరెస్ట్ చేసినప్పటికీ, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల మండిపడ్డారు.

ఆనాటి ఘటనను జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. “తెలంగాణ అభివృద్ధి కోసం తాము చేసిన సాహసాలను గుర్తు చేసుకునే క్రమంలో బాబ్లీ ఘటనను మననం చేసుకున్నారు. నాడు మహారాష్ట్ర పోలీసులు తమను క్రిమినల్స్ కంటే హీనంగా చూశారని, పోలీసుల లాఠీ దెబ్బలతో నామాకు గాయమైందని, ఉత్తర తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకే నిర్ణయించుకున్న తమను పాడుబడ్డ గదిలో వేసినా, న్యాయం జరిగేదాకా అక్కడి నుంచి కదిలేదని లేదని తేల్చిచెప్పమని, తెలంగాణ అభివృద్ధి కోసం రాజీ లేని పోరు సాగించిన తమను గ్రేటర్ ఓటర్లు ఆదరిస్తారన్న నమ్మకం తమకుందని” చంద్రబాబు నాటి ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు.