అమరావతిలో పరిపాలన నగరంలో నిర్మించే భవనాల డిజైన్లు ఒక కొలిక్కి వచ్చాయి. హైకోర్టు సహా మిగతా భవనాల ఆకృతులన్నీ దాదాపు ఖరారు అయ్యాయి. శాసనసభ భవన తుది ఆకృతిని 40-45 రోజుల్లో ఖరారు చెయ్యనున్నారు. శాసనసభ భవనం మినహా మిగతా భవనాల నిర్మాణాలన్నీ త్వరలోనే స్టార్ట్ అవుతాయి.
ముఖ్యమంత్రి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపించారు. రాజమౌళి విలువైన సలహాలిచ్చారని, బాగా మమేకమై పనిచేశారని ప్రశంసించారు.
శాసనసభ భవనానికి సంబంధించి నార్మన్ ఫోస్టర్ సంస్థ తాజాగా రూపొందించిన చతురస్రాకారపు ఆకృతితో పాటు భవనంపై పొడవైన టవర్ రూపొందించిన ఆకృతుల్ని మెరుగుపరచాలని ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం. అతి త్వరలో భూమి పూజ చేసి నిర్మాణాలు చేపడతారు. 2018 చివరికల్లా పూర్తి చెయ్యాలని లక్ష్యం.