ఏపీ మంత్రి వర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశాలున్నాయని మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. ఏకంగా ఏడుగురు మంత్రులు తమ పదవులను కోల్పోయే అవకాశం ఉన్నట్టు సమాచారం. పదవులు కోల్పోనున్న వారిలో పల్లె రఘునాథరెడ్డి, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, మృణాళిని, రావెల కిషోర్ బాబులు ఖచ్చితంగా ఉన్నట్టు సమాచారం. మరో మంత్రి అచ్చెన్నాయుడిపై కూడా కత్తి వేలాడుతున్నట్టు తెలుస్తోంది. వీరిలో నారాయణను మంత్రి పదవి నుంచి తొలగించి సీఆర్డీఏ ఛైర్మన్ పదవిని అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
ఇక, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గొల్లపల్లి సూర్యారావు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కళా వెంకట్రావు, సుజయకృష్ణ, భూమా అఖిలప్రియలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన మహ్మద్ జానీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మైనార్టీ కోటాలో కేబినెట్ లోకి తీసుకుంటారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, నారా లోకేష్ కు మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రిగా పట్టాభిషేకం చేయనున్నట్టు తెలుస్తోంది. ఉగాది పర్వదినాన ఈ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.