ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీకి దగ్గర అవుతున్నారా అనే ఊహాగానాల మధ్య ఆయన ఒక బీజేపీ ఎంపీతో మాటామంతీ జరపడం అందరినీ ఆకర్షించింది. ఒక ప్రైవేటు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుని బీజేపీ నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ కలిశారట. ఆ వివరాలు ఆయన ట్విట్టర్ లో తెలిపారు.
అరవింద్ తో పాటు ఆయన తండ్రి రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు తెలంగాణాలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందని అరవింద్ ని అడిగారట. దానికి తెలంగాణ బీజేపీ వైపు చూస్తుందని చెప్పా అని అరవింద్ ట్విట్టర్ లో తెలిపారు.
అదే క్రమంలో చంద్రబాబు కాంగ్రెస్ లో మొదటి సారి ఎమ్మెల్యేగా ఉండగా అరవింద్ తాతగారు అర్గుల్ రాజారామ్ ఆర్ధిక మంత్రిగా పని చేసిన విషయాన్నీ కూడా గుర్తు చేసుకున్నారట. దానికి సంబంధించిన ఫోటోలను కూడా అరవింద్ ట్విట్టర్ లో పెట్టారు. అయితే మోడీని తిట్టిన చంద్రబాబుని కలవడం మాకు ఇష్టం లేదని పలువురు అనడం విశేషం.
ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు కుమార్తె కవితను నిజామాబాదు ఎంపీ స్థానంలో ఓడించి జైంట్ కిల్లర్ గా ఆవిర్భవించారు. తెలంగాణ బీజేపీ యువనాయకులలో అత్యంత యాక్టీవ్ గా ఉండేది అరవిందే.