అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి ఓ మూడు కార్యక్రమాలకు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం వేదిక అయ్యింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన ‘ఎన్టీఆర్ అన్న క్యాంటీన్’ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 3 రూపాయలకు 2 ఇడ్లీలు, 4 రూపాయలకు 2 చపాతీలు, 5 రూపాయలకే ఉప్మా, పులిహోర్, పెరుగన్నం, 7 రూపాయలకు సాంబార్ అన్నం లభించే అన్న క్యాంటీన్లను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింప చేస్తామని సిఎం చెప్పారు. ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు టిఫిన్, టీలు అందుబాటులో ఉండనుండగా, మధ్యాహ్నం 12 నుండి 2, రాత్రి 7 నుండి 9 గంటల వరకు భోజనాలు ఏర్పాటు చేయనున్నారు.
ఆహార నాణ్యత ఎలా ఉందో తెలుసుకోవడానికి స్వయంగా చంద్రబాబు రుచి చూడడం విశేషం. ‘అన్న క్యాంటీన్’ సంక్షేమ పధకం ఇలా ఉంటే… రాజధానికి అనుసంధానం చేసే 18.3 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి కూడా సిఎం శంకుస్థాపన చేసారు. కనకదుర్గమ్మ వారధి నుండి వెంకటపాలెం మీదుగా ఉద్దండరాయుని పాలెం, లింగాయపాలెం, తాళ్ళయపాలెం గ్రామాలకు రాజధానితో అనుసంధానం అయ్యే ఈ 6 వరుసల రహదారి నిర్మాణం కోసం దాదాపుగా 215 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించనుంది.
ఇక, అత్యంత ప్రతిష్టాత్మకమైన మరో కార్యక్రమం… రైతులకు ప్లాట్ల పంపిణీ చేయడం. ఇప్పటికే వివిధ సందర్భాలలో వాయిదాలు పడిన ఈ కార్యక్రమం కోసం రాజధాని రైతులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేలపాడు గ్రామం నుండి జరగనున్న పంపిణీపై మిగతా గ్రామాల ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. దాదాపు మరో ఆరు నెలల పాటు జరగనున్న ఈ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో రాజధాని ప్రాంత రైతులకు నేడు తెలియనుంది. తమకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడ వచ్చాయో క్షణాల్లో తెలుసుకొనుట కొరకు…. రైతుల సౌలభ్యం మేరకు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను కూడా ప్రభుత్వం రూపొందించింది. ఒకే రోజు మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు రాజధానిలో కొలువు తీరడంతో రాజధాని వాసులకు మరపురాని రోజుగా మారిపోయింది జూన్ 25వ తేదీ.