Chandrababu_naidu_Kuppamఈరోజు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. శాంతిపురం మండలంలోని పెద్దూరు, శివకురుబూరులో ఇదేం ఖర్మ రాష్ట్రానికి? కార్యక్రమం నిర్వహించేందుకు చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 2 గంటలకి పెద్దూరు చేరుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం కేనుమాకురిపల్లిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు.

అయితే రోడ్లపై రోడ్ షోలు సభలు, సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు రోడ్ షోకి అనుమతి లేదంటూ పోలీసులు ఆయన ప్రచార రధాన్ని, దాంతోబాటు సౌండ్ సిస్టమ్, టిడిపికి చెందిన కార్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. చంద్రబాబు నాయుడు వచ్చే దారి పొడవునా భారీగా పోలీసులను మోహరించి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న టిడిపి కార్యకర్తలను అడ్డుకొని వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.

పోలీసులు ఈ కార్యక్రమాలకి అనుమతించిన తర్వాతే ఏర్పాట్లు చేసుకొన్నామని కానీ ఇప్పుడు ఆఖరి నిమిషంలో ఎందుకు అడ్డుకొంటున్నారని స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని వాదిస్తున్నారు. కనుక చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఏం జరుగబోతోందో తెలీని పరిస్థితి నెలకొంది.