ఏపీ సర్కార్ ‘అమ్మ’ అన్నా కూడా అందులో ‘బూతు’ వెతికే రకంగా జగన్ పత్రిక ‘సాక్షి’ కధనాలు ప్రసారం చేయడం, దినపత్రికలో వార్తలు ప్రచురితం చేయడం తదితర సంగతులు తెలిసినవే. అంతటి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న సాక్షి పత్రిక గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కృష్ణా పుష్కరాల’ ఏర్పాట్ల గురించి ఎలాంటి విమర్శలు చేయకపోవడం విశేషం. స్థానిక పేజీలలో చిన్న చిన్న వార్తలు తప్ప, కృష్ణా పుష్కరాలపై జగన్ పత్రిక అక్కసు వెలిబుచ్చకపోవడమనే సమాచారం ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దాకా వెళ్ళింది.
సదరు విషయమై సిఎం చంద్రబాబు ఒక ప్రకటన చేయడం కూడా విశేషం. పుష్కర ఏర్పాట్లపై సమీక్ష జరిపిన తర్వాత సంతృప్తి చెందిన చంద్రబాబు… ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… పుష్కర ఏర్పాట్లపై జనం సంతృప్తిగా ఉన్నారని, దీనిపై ‘సాక్షి’ పత్రిక కూడా వ్యతిరేక కధనాలు రాయలేకపోతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంటే పుష్కర ఏర్పాట్లపై జగన్ పత్రిక కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లేనని అన్నారు.
చంద్రబాబు చెప్పినట్లుగా నిజంగా సాక్షి పత్రిక పుష్కరాల ఏర్పాట్లపై సంతృప్తిగా ఉందో లేక ఇటీవల తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలలో భాగంగా ప్రభుత్వ వ్యతిరేక కధనాల సంఖ్యను తగ్గించే క్రమంలో ఎలాంటి విమర్శలు చేయడం లేదోనన్న చర్చ మీడియా వర్గాలలో జరుగుతోంది. అదీ గాక, ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయంపై అనవసర రాద్ధాంతం చేస్తే, తన కన్ను తానే ఎందుకు పొడుచుకున్నట్లు అవుతుందని సైలెంట్ గా ఉందేమోనన్న భావన కూడా వ్యక్తమవుతోంది.