Chandrababu Naidu - Jr NTRనందమూరి హరికృష్ణ వర్ధంతి నేడు. రెండు సంవత్సరాల క్రితం ఒక శుభకార్యానికి వెళ్తూ మార్గమధ్యలో ఆక్సిడెంట్ కు గురయ్యారు ఆయన. ఆసుపత్రికి తీసుకుని వెళ్లే లోపే మరణించారు. ఇది ఇలా ఉండగా ఈరోజు ఆయనకు పలువురు నివాళులు అర్పిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ఇచ్చిన నివాళి ఇప్పుడు చర్చనీయాంశం కావడం విశేషం.

“నందమూరి హరికృష్ణగారంటే ఆపన్నులకు అండగా నిలిచే ఆత్మీయత, క్రమశిక్షణ, నిరాడంబరతలకు ప్రతిరూపం. హరికృష్ణగారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ, ఆయన స్మృతికి నివాళులు,” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

గతంలో అనేక మంది హీరోలకు బర్త్ డే విషెస్ చెప్పిన సందర్భంగా చంద్రబాబు, లోకేష్ లు తమ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజుకు విష్ చెయ్యలేదని ఎన్టీఆర్ అభిమానులు వారి మీద విరుచుకుపడే వారు. వారి మధ్య ఏం జరిగిందో తెలీదు గానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆ విషయంగా చంద్రబాబు, లోకేష్ ల మీద కోపంగానే ఉంటారు.

అయితే హరికృష్ణ వర్ధంతికి నివాళి అర్పించడంపై కూడా వారు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా కొందరు మాత్రం ఈ విషయాన్ని వేరేగా చూడాలని అంటున్నారు. “వారి మధ్య ఏదో జరిగి ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు మాములే కదా. అందులో తప్పు ఎవరిదైనా కావొచ్చు. అది కుటుంబం మధ్యే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు వారే వాటిని సరిదిద్దుకుని మళ్ళీ కలుస్తారు. బయట వారు దానిలో కలగజేసుకుని ఆవేశపడటం అనవసరం,” అంటూ చెబుతున్నారు.