Chandrababu Naidu Increases Age Limit government Jobsనిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న సర్కారు ప్రకటన వెలువడితే నిరుద్యోగులకు పండగే. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగ అభ్యర్థుల వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఏపీలో ఉద్యోగ దరఖాస్తు వయోపరిమితి గతేడాది వరకు 34 ఏళ్లుగా ఉండేది. తర్వాత దానిని 40 ఏళ్లకు పెంచారు.

తాజాగా ఇపుడు మరో రెండేళ్లు కలిపి 42 ఏళ్లుగా మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, 34 ఏళ్ల వయోపరిమితిని ఏడాది పాటు 40 ఏళ్లకు పెంచుతూ గతేడాది ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, ఒక ఏడాది గడువు ముగిశాక మరో ఏడాది పాటు దానిని పెంచారు. అయితే గత కొన్నేళ్లుగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచి 42 ఏళ్లుగా మార్చాలని నిరుద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

త్వరలో విడుదల చేయబోయే గ్రూప్-2 నోటిఫికేషన్‌తో పాటు ఇతర ఉద్యోగాలకు దీనిని వర్తింపజేసే యోచనలో ఉన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు అధికారులతో మాట్లాడినట్టు సమాచారం. సీఎం నిర్ణయం మేరకు త్వరలో వయోపరిమితి పెంపును అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రకటన వెలువడితే, నిరుద్యోగులంతా చంద్రబాబు సర్కార్ కు ‘జై’ కొడతారని చెప్పడంలో సందేహం లేదు. ఏపీలో ఉద్యోగ కొరతలు అలా ఉన్నాయి మరి!