నిన్న జరిగిన అఖిలపక్ష భేటీకి డుమ్మా కొట్టిన వైఎస్సాఆర్ కాంగ్రెస్, జనసేన, బీజేపీలకు మరోసారి ఆహ్వానం పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆహ్వానం సరిగ్గా లేదు అని జనసేన విమర్శలు చేసిన తరుణంలో ఈ సారి మంత్రులను ఆయా పార్టీల నాయకుల వద్దకు పంపాలని నిర్ణయించుకున్నారు.
“అన్ని పార్టీలను కలుపుకువెళ్లాలి అనే ఉద్దేశంతోనే మేము ఉన్నాం. రాజకీయాలకు ఇది సమయం కాదు. మా మంత్రులు వెళ్లి వాళ్లను పిలుచుకుని వస్తారు. రాకపోతే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయం. రాష్ట్రప్రజలు శ్రేయస్సు కోసం బీజేపీ నాయకులు కూడా కలిసి రావాలి,” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అయితే ఆ మూడు పార్టీలు వెళ్లే అవకాశం దాదాపుగా లేవనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏప్రిల్ 2, 3వ తేదీల్లో సీఎం చంద్రబాబునాయుడు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి…అక్కడ అన్ని రాజకీయపక్షాలు, జాతీయ స్థాయి నాయకులను కలవాలని భావిస్తున్నట్టు సమాచారం.