మహాకూటమిలో సీట్ల పంపకం ఫైనల్ అయ్యే దశలో టీ.టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం అవుతున్నారు. తెలంగాణలో ఏర్పడే కూటమి జాతీయస్థాయిలో ప్రభావం చూపుతుందని బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ 12 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని.. మరో 6 సీట్లు అడుగుదామన్నారు.
మహాకూటమి గెలుపునకు టీడీపీ కార్యకర్తలు కష్టపడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. టికెట్ రాని వారు అసంతృప్తి చెందవద్దన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రత్యామ్నాయ పదవులు కూడా దక్కుతాయని అన్నారు.
తెలంగాణలో ప్రచారం చేయాలని టీడీపీ నేతలు కోరగా అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో నాలుగు సభలు పెట్టాలని చంద్రబాబును నేతలు కోరినట్లు సమాచారం. హైదరాబాద్లో ఆరు స్థానాలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటుకు నోటు ఉదంతం తరువాత చంద్రబాబు తెలంగాణ రాజకీయాలలో పెద్దగా యాక్టీవ్ గా లేని సంగతి తెలిసిందే. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్ స్థానాలు టీడీపీకేనంటూ చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ స్థానాల కోసం కాంగ్రెస్తో మాట్లాడుతానని టీడీపీ నేతలతో చంద్రబాబు అన్నారు.