Chandrababu naidu fixed date for cabinet expansionఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వ్యస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2న కేబినెట్‌ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఏమైనా చివరి నిముషంలో ట్విస్ట్ లు ఉండి ఆ రోజు జరగలేకుంటే, ప్రత్యామ్నాయంగా 6వ తేదీన ఖాయమని పొలిటికల్ ఇన్ఫర్మేషన్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అప్పటి మంత్రివర్గాన్నే కొనసాగిస్తున్నారు. రెండేళ్ల లోపు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం ఆనవాయితీ అయినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

తాజా పరిణామాలను బట్టి చూస్తే ప్రస్తుత కేబినెట్ నుంచి నలుగురైదుగురికి ఉద్వాసన పలకనున్నారని తెలుస్తోంది. దీంతో పది మంది కొత్త వారికి ఛాన్స్ లభించే అవకాశం వుందని, ఆ జాబితాలో ముందు వరుసలో నారా లోకేష్, భూమా అఖిలప్రియలు ఉన్నారని, వీరిద్దరికీ ఖచ్చితంగా మంత్రి పదవులు ఖాయమయ్యాయని సమాచారం. అలాగే ముస్లిం మైనారిటీ నుంచి ఎంఏ షరీఫ్, జలీల్ ఖాన్, చాంద్ బాషాలలో ఒకరిని కేబినెట్‌లోకి తీసుకోవచ్చని సమాచారం. పార్టీ సీనియర్ నేతలైన కళా వెంకట్రావు, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులకు కూడా మంత్రి పదవి వరించే అవకాశం స్పష్టంగా కనపడుతున్నాయి.

ఆరోగ్యం దెబ్బతినడం కారణంగా కదల్లేని స్థితిలో ఉన్న ఓ సీనియర్ మంత్రికి ఉద్వాసన తప్పకపోవచ్చని, అలాగే చురుగ్గా ఉన్నప్పటికీ తన శాఖపై పట్టు సాధించలేకపోయిన మరో మంత్రి పైనా వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఆశావహుల జాబితా అయితే కళావెంకట్రావు, సుజయ రంగారావు, గౌతు శివాజీ, ఎంవీవీఎస్ మూర్తి, బండారు సత్యనారాయణ, అనిత, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు, బొండా ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, ధూళిపాళ నరేంద్ర… ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా చాలా పెద్దదే!