ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన ‘సాక్షి’ దినపత్రికలో కృష్ణా జలాలపై ప్రచురించిన వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏంటీ రాతలు?” అంటూ నిప్పులు చెరిగారు. ఆ పత్రిక రాతలు దుర్మార్గంగా, నీచాతినీచంగా ఉన్నాయని, తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, జగన్ పత్రిక రాతలపై ఈ సందర్భంగా ప్రజలందరూ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
ముందుగా ‘జలసిరి’ పాట ‘జల జల జల జలసిరికి హారతి… జన జన జన జనసిరికి హారతి…’ అంటూ సాగే పాటను తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి విడుదల చేశారు. అనంతరం సాక్షి తెలంగాణ ఎడిషన్ లో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ… ‘ఆంధ్రులను నీటి దొంగలుగా చిత్రీకరించారని’ మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న జగన్, కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాళ్లను రెచ్చగొట్టే రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇటువంటి వార్తలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. జగన్ తన పత్రికలో రాయిస్తున్న రాతలు పరమ దుర్మార్గంగా ఉన్నాయన్నారు. ఆ రాతలతో జగన్ తీరు మరోమారు ప్రస్ఫుటమైందన్నారు. స్వార్ధ రాజకీయాలు సర్వసాధారణమే గానీ, ముఖ్యమంత్రి కావాలన్న ఏకైక లక్ష్యంతో… తెలంగాణాలో ఆంధ్ర ప్రజల పరువు తీయడం ఒక్క జగన్ కే చెందినట్లుగా కనపడుతోంది. ఇది తెలుసుకున్న ఏపీ ప్రజానీకం… జగన్ వి ఇంత నీచమైన ఆలోచనలా… అంటూ నోరెళ్ళబెడుతున్నారు.