వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. హుద్ హుద్ తుపానుతో అతలాకుతలమైన నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దితే, దానిని తగలబెట్టాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశప్రజలందరూ ఆనందంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంటే రాజకీయ పార్టీలు ఆందోళనలకు పిలుపునివ్వడం దేశ చరిత్రలో ఎన్నడూ లేదన్నారు.
విశాఖ విమానాశ్రయంలో జగన్ వ్యవహరించిన తీరుతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారని, భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన డీఐపీపీ కార్యదర్శి కూడా జగన్ నిర్వాకంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని, ప్రత్యేక హోదాతో సమానంగా అన్ని ప్రయోజనాలు కల్పిస్తామంటేనే ప్యాకేజీకి అంగీకరించినట్టు మరోసారి స్పష్టం చేశారు.
అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, విశాఖపట్టణంలో నౌకా ప్రదర్శన జరుగుతున్న సమయంలో తునిలో రైలును తగలబెట్టారని, ఇప్పుడు భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తుంటే దానిని విచ్ఛిన్నం చేసేందుకు విశాఖను తగలబెట్టాలని జగన్ కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనేదో దాబా పెట్టుకున్నట్టు, అందరినీ పిలిచి భోజనం చేసి వెళ్లండని ప్రాధేయ పడేందుకు దావోస్ వెళ్లినట్టు విమర్శలు చేస్తున్నారని, అయినా మన రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు అదేనన్నారు.
అధికారం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారంటూ తీవ్రస్థాయిలో జగన్ పై మండిపడగా, ఇదే సమయంలో విశాఖ వాసుల గొప్పతనాన్ని కొనియాడారు. పులివెందులకు ఓ చరిత్ర ఉందని, దాన్ని ఇక్కడ ఎక్కడ పునరావృతం చేస్తారోనని విశాఖ వాసులు భయపడ్డారని, వారు ఇక్కడ గెలిస్తే కడప రాజకీయాలకు, భూకబ్జాలు, నేరాలు, ఘోరాలకు విశాఖ నగరం వేదిక అవుతుందని భయపడ్డారని, ఆ భయంతోనే వైఎస్ సతీమణి విజయను ఓడించారని చలోక్తులు వేసారు.
#M9NewsWin1000 contest every Wednesday – Answer our Question and win Rs 1000 Paytm Gift vouchers #contest2 pic.twitter.com/Yx6Z5Wql50
— M9News (@M9News) January 23, 2017