Chandrababu Naidu Family declares assetsప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా చంద్రబాబు కుటుంబం తమ ఆస్తులను ప్రకటించింది. చంద్రబాబు తనయుడు లోకేష్ కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి వాటిని విడుదల చేశారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.85 లక్షలు పెరిగాయని తెలియజేశారు. చంద్రబాబు నికర ఆస్తి 3.87 కోట్లు.. అప్పులు రూ.5.13 కోట్లు ఉన్నాయని తెలిపారు.

ఇక తన తల్లి భువనేశ్వరి ఆస్తి రూ.53 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గిందని చెప్పుకొచ్చారు. నారా లోకేష్ ఆస్తి 24 కోట్లు.. బ్రాహ్మణి ఆస్తి 15 కోట్ల 68 లక్షలు.. దేవాన్ష్‌ ఆస్తి 19 కోట్ల 42 లక్షలుగా ఉన్నాయని వివరించారు. ఇక తన పేరిట ఉన్న షేర్లు బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు.

9 ఏళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్న రాజకీయ కుటుంబం అని చెప్పారు. ఇదే సందర్భంగా తాము చెప్పిన ఆస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారం కాదని, ప్రభుత్వ లెక్కల విలువ అని లోకేష్ స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా హెరిటేజ్ ఫుడ్స్ రాజధానిలో ఎటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడలేదని లోకేష్ చెప్పారు.

రాజధాని 29 గ్రామాల్లో హెరిటేజ్‌కు ఎలాంటి భూమి లేదన్నారు. రాజధాని బయట మాత్రం 2014లో హెరిటేజ్‌ పేరిట 9 ఎకరాలు కొన్నట్లు వివరించారు. ఇదే సందర్భంగా ఇటీవలే చంద్రబాబు మాజీ పీఎస్ మీద జరిగిన ఐటీ దాడులను కూడా ఆయన కొట్టిపారేశారు. “మేం ఏనాడు తప్పు చేయలేదు.. ఏం దొరకనప్పుడు ఏం చెప్పాలి?. నిండా మునిగిన వాళ్లు ఏం మాట్లాడరు కానీ.. ఏం దొరికాయని మేం సమాధానం చెప్పాలి.’’ అని ప్రశ్నించారు.