Chandrababu naidu explains on amaravati developmentరాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఏపీ రాజ‌ధానిని 1690 ఎక‌రాల్లో 15 ఏళ్ల‌లో మూడు ద‌శ‌ల్లో ప‌నులు చేస్తామని వివ‌రించారు. ఈ ప‌నుల్లో సింగ‌పూర్ క‌న్సార్టియంకు 58 శాతం వాటా ఉంటుంద‌ని, 42 శాతం వాటా ఏడీసీకి ఉంటుంద‌ని స్పష్టం చేసారు. అయితే రాజధానిలో ఉన్న భూమిపై హక్కులు ఎల్ల‌ప్పుడు సీఆర్‌డీఏ వ‌ద్దే ఉంటాయని చెప్పారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ప్ర‌పంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు వ‌స్తున్నాయ‌ని, అందుకు అనుగుణంగా రాజధాని నిర్మాణం ఉంటుందని తెలిపారు.

సింగ‌పూర్ క‌న్సార్టియం 2,118 కోట్ల పెట్టుబ‌డులు పెడుతుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఏపీలో ఆదాయం లేద‌ని, అయిన‌ప్ప‌టికీ అధైర్య ప‌డ‌వ‌ద్ద‌ని తాను ముందు నుంచే చెబుతూ వ‌స్తున్నాన‌ని అన్నారు. అన్ని అంశాల‌ను ప‌రిశీలించుకొని, తెలివిగా ముందుకు వెళ్లాల‌ని తాను సూచిస్తున్నట్లు చెప్పారు. రాజ‌ధాని అన‌గానే వెంట‌నే క‌ట్టేసేది కాద‌ని తాము అధికారంలోకి వచ్చిన మొద‌టి రోజు నుంచి ఇదే చెబుతున్నాన‌ని అన్నారు. అమరావతి ఒక ఆర్థిక న‌గ‌రంగా తెలుగు జాతి గ‌ర్వ‌ప‌డేలా త‌యారు కావాలని అభిలాషించారు.

రాజ‌ధానిలో ఆరోగ్యన‌గ‌రి, విద్యాన‌గ‌రిల‌ను ఏర్పాటు చేస్తామ‌ని, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని ఒక్కో మెట్టు తీర్చిదిద్దడానికి ప్రణాళిక వేశామని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం తాము ఇలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంటే, మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం రాజ‌ధాని నిర్మాణంలో అవినీతి జ‌రిగిపోతోంద‌ని తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేత‌లు రాజ‌ధాని నిర్మాణానికి అడ్డుప‌డ‌డానికి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయాలో అన్ని ప్ర‌య‌త్నాలు చేశార‌ని, చివరికి కోర్టుల‌కి కూడా వెళ్లారని, రైతుల‌ను రెచ్చ‌గొట్టారని అయిన‌ప్ప‌టికీ తాము వెన‌క‌డుగు వేయ‌లేదని అన్నారు.