రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుండడంతో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ కేంద్రంగా జరుగుతున్న పొలిటికల్ స్కెచ్ లు ఏళ్ళ తరబడి రాజకీయాలలో ఉన్న వారికే విస్మయానికి గురి చేస్తున్నాయి.

అధికారంలో ఉండి చేసిన వాటి కంటే, అధికారం చేపట్టక ముందు నుండే వైసీపీ అజమాయిషీ రాష్ట్రంలో మొదలైందన్న వాదనలు తాజాగా ప్రారంభమయ్యాయి. అందుకు ఊతమిచ్చే అంశాలు రెండు… ఒకటి ఎయిర్ పోర్ట్ లో వైఎస్ జగన్ పై జరిగిన కోడి కత్తి కేసు! మరొకటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు! ఈ రెండు కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు జరిగిన సంఘటనలు.

కోడి కత్తి కేసులో ఉన్న నిందితుడు ఇప్పటికే జైలు నుండి బయటకు వచ్చేసి హాయిగా తన జీవనాన్ని సాగిస్తుండగా, తాజాగా దస్తగిరి ‘కన్ఫెషన్ స్టేట్మెంట్’తో వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన ముద్దాయిలు ఎవరన్నది బయటకు వచ్చింది. కానీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళితే… ఈ రెండింటి వెనుక ఉన్నది చంద్రబాబేనని నిందలు వేసి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ విజయవంతం అయ్యింది.

అధికారం చేతిలో ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి చంద్రబాబు మెతక వైఖరికి సూచిస్తుంది. నిజానికి ఈ రెండే కాదు… నాడు రాజధాని గ్రామాలలో పొలాలను తగలబెట్టిన కేసులో గానీ… తుని రైలు విధ్వంస కేసులో గానీ… కొడాలి నాని బూతుల అంశంలో గానీ… ఇలా ఏ చిన్న విషయంలో కూడా చంద్రబాబు ప్రతిపక్షాల వైఖరిని తిప్పి కొట్టలేకపోయారు.

ఆ తర్వాత ఒక్కొక్కటిగా పజిల్ వీడిపోతూ… వీటన్నింటి వెనుక ఉన్న ‘సూత్రధారి’ ఎవరన్నది తెలిసినా… జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ‘మెత్తగా ఉంటే ఎవరికైనా ఒత్త బుద్ధవుతుందన్న’ చందంగా చంద్రబాబు వైఖరి ఉండడం టిడిపి వర్గాలకు సైతం మింగుడు పడని అంశంగా మారింది.

బహుశా లోకేష్ అందుకే ఇటీవల ‘తాను మా నాన్నంత మంచి వాడినైతే కాదని’ హెచ్చరిక చేసాడేమో!?