టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిన్న విశాఖ జిల్లా తాళ్ళవలసలో జరిగిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలు, అవకతవకలు, అక్రమాలు, అవినీతి గురించి వివరించారు. జగన్ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్లవలసిన దుస్థితి ఏర్పడిందని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలు, సచివాలయాలకు కూడా వైసీపీ రంగులు వేసి కోర్టు చేత మొట్టికాయలు వేయించుకొన్నారని, ప్రభుత్వ భూములు ఇష్టారాజ్యంగా అమ్మేసుకొంటున్నారంటూ చాలా విషయాలు ప్రస్తావించారు.
అయితే మూడేళ్ళ వైసీపీ పాలన గొప్పదనం గురించి ఒక గంటో అరగంటలోనో పూర్తిగా చెప్పుకోవడం చాలా కష్టం. ఏకంగా ఓ పెద్ద పుస్తకమే వ్రాయాల్సి ఉంటుంది. కనుక చంద్రబాబు నాయుడు తాజా అంశాలను మాత్రమే ప్రస్తావించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి, ప్రజలపై నానాటికీ పెరిగిపోతున్న ఆర్ధికభారం, రాష్ట్రంలో జరుగుతున్న విపరీత పరిణామాలను చూస్తుంటే మార్పు అవసరమని సామాన్య ప్రజలు సైతం భావిస్తున్నారు. వారి మనసులో మాటనే చంద్రబాబు నాయుడు చెప్పారనుకోవచ్చు.
ఈ సంగతి సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా గ్రహించినట్లే ఉన్నారు. అందుకే పనితీరు బాగోలేనివారికి, ఎన్నికలలో గెలవలేనివారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టినట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పేశారు. అందుకే ఎన్నికలకి ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఇప్పటి నుంచే శాసనసభ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టేసి, మే 10వ తేదీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు అందరూ ‘గడప గడపకి వైసీపీ’ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడే జిల్లా యాత్రలు మొదలుపెట్టేశారు.
వైసీపీ అధినేతలో ఈ ఆందోళన, అభద్రతాభావం చూస్తుంటే తన పాలన గురించి చంద్రబాబు నాయుడు చెప్పింది అక్షరాల నిజమని ఆయనకు కూడా అర్దమైనట్లే ఉంది లేకుంటే సంక్షేమ పధకాల పూల నావలో ప్రయాణిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇంతగా కంగారు పడవలసిన అవసరం ఏమిటి?