హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలుకు పొరుగు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పిలవకపోవడం వివాదంగా మారింది. దీనిపై చంద్రబాబు హుందాగా స్పందించారు. ‘తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సభలకు మిమ్మల్ని పిలవలేదు కదా! మీ కామెంట్ ఏమిటి?’’ అని ఓ విలేఖరి చంద్రబాబుని ప్రశ్నించారు.
‘‘నన్ను పిలవకపోయినా ఫర్వాలేదు. తెలుగువారం ఎక్కడ ఉన్నా మన భాషను గౌరవించుకోవాలి. భాషను కాపాడుకోవాలి. తెలుగు మహాసభలు ఎక్కడ జరిగినా తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుపుతుంది. తెలుగువారంతా కలిసి ఉండాలన్నది మా ఆకాంక్ష. ఎవరు ఎక్కడ ఉన్నా మనమంతా తెలుగు వారమన్న స్ఫూర్తి పోకూడదు’ అని చంద్రబాబు బదులిచ్చారు.
చంద్రబాబుని పిలవకపోవడంతో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుని కూడా మహాసభలకు దూరం పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. పైగా సభల్లో ఎక్కడ ఆంధ్ర ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ సభల వాళ్ళ తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎంతోకొంత మేలు జరిగితే మంచిదే.