ఈ నెల 31న తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. పశ్చిమబంగ, దిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ దీనికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మరికొందరు జాతీయ స్థాయి నేతలు కూడా పాల్గొనే అవకాశముంది. మమత ఫెడరల్ ఫ్రంట్ లో ఉన్నారని తెరాస నేతలు చెప్పుకుంటుండగా ఆమెను తెలుగుదేశం పార్టీ సభకు తీసుకుని వస్తే అది చంద్రబాబు పరపతిని పెంచేదే అవుతుంది. ఈ సారి విశాఖ పార్లమెంట్ లో గట్టి పోటీ ఉంది.
విశాఖపట్నం లోక్సభకి తెదేపా నుంచి దివంగత మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్.మూర్తి మనమడు, బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్, వైకాపా తరఫున సత్యనారాయణ, జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, భాజపా నుంచి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. దీనితో తెలుగుదేశం పార్టీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుద్ హుద్ సమయంలో విశాఖ కోసం చంద్రబాబు చేసిన పని ఇంతా అంతా కాదని అదే అక్కడ తెలుగుదేశం అభ్యర్థిని గెలిపిస్తాదని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
మొదటి నుంచీ ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ పోలింగ్కి ముందు భారీ స్థాయిలో బల ప్రదర్శన చేయాలన్న ఉద్దేశంతో బహిరంగసభ నిర్వహించబోతోంది. అదే సమయంలో ఈ సభ జరిగిన ఒక్క రోజు తరువాత కర్నూల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. ఇదే సభకు రెండు రోజుల ముంది మోడీ రాజమహేంద్రవరంలో ఇంకో సభలో ప్రసంగించనున్నారు. దీనితో మర్చి 29 నుండి ఏప్రిల్ 1 వరకు నాలుగు రోజులు జాతీయ మీడియా దృష్టి ఏపీ మీదే ఉంటుంది.