టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్లో తల్లితండ్రులు, అత్తమామల కాళ్ళకి నమస్కరించి అందరి ఆశీర్వదాలు తీసుకొన్నారు. ఏడాదిపైగా ఎండనక, వాననక పాదయాత్ర చేసేందుకు బయలుదేరుతున్న నారా లోకేష్ పాదాలకి నమస్కరిస్తుంటే చంద్రబాబు నాయుడు దంపతులు, బాలకృష్ణ దంపతులు అందరూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యి కనీళ్ళు పెట్టుకొన్నారు. కానీ తేరుకొని అందరూ కారు వరకు వచ్చి నారా లోకేష్ని సాగనంపారు. నారా లోకేష్ అర్దాంగి బ్రాహ్మణి ఎదురేగి నారా లోకేష్కి హారతి ఇచ్చి క్షేమంగా పాదయాత్ర ముగించుకొని రమ్మనమని పంపించారు.
నారా లోకేష్ పాదయాత్రకి బయలుదేరుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు నివాసానికి భారీగా టిడిపి నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. వారి నినాదాలతో ఆ ప్రాంతమంతా చాలా కోలాహలంగా మారింది. వారందరితో కలిసి నారా లోకేష్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని తాతగారికి నివాళులు అర్పించారు.
నారా లోకేష్ రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకొంటారు. శుక్రవారం ఉదయం కుప్పంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత 4,000 కిమీ యువగళం పాదయాత్ర ప్రారంభిస్తారు. ఆదేరోజు సాయంత్రం కుప్పంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తారు. మొత్తం 400 రోజులపాటు సాగే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది.