Chandrababu Naidu, Chandrababu Naidu Amaravati, Chandrababu Naidu Hyderabad, special train Amaravati Hyderabad city, Telanganaఎలాగైనా అమరావతి నుండి పాలన సాగించాలని లక్ష్యం పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉద్యోగుల కోసం మరో కీలక సదుపాయం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ ను వీడి రావడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో వారి కోసం ప్రత్యేకంగా ఓ రైలును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు ఏర్పాటు చేసిన విందు సందర్భంలో… ఉద్యోగుల వైనాన్ని చెప్తూ, ఒక స్పెషల్ ట్రైన్ ను విజయవాడ – సికింద్రాబాద్ ల మధ్య నడపాల్సిందిగా కోరారు.

దీనికి సుముఖత వ్యక్తం చేసిన రైల్వే మంత్రి, ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. మరో పది రోజుల్లోనే అంటే నిర్దేశిత గడువు అయిన 27వ తేదీన పట్టాలేక్కే ఈ రైలును వారానికి మూడు రోజులు పాటు నడపనున్నారు. అమరావతి ఉద్యోగులకు వారానికి 5 రోజులే పని దినాలు కావడంతో వీకెండ్ లో వారంతా హైదరాబాద్ చేరుకునేందుకు ఈ రైలును వినియోగించుకోనున్నారు.

సికింద్రాబాద్ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి ఉదయానికి విజయవాడ చేరుకోగా, అలాగే అదే సమయంలో విజయవాడలోనూ రాత్రి 10 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయానికి సికింద్రాబాద్ చేరుతుందట. ఇప్పటికే ఈ రైలుకు అవసరమైన కోచ్ లను కూడా రైల్వే శాఖ సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగులను రప్పించడానికి చంద్రబాబు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావని ఈ సందర్భంగా స్పష్టంగా అర్ధమవుతోంది.