ఎలాగైనా అమరావతి నుండి పాలన సాగించాలని లక్ష్యం పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉద్యోగుల కోసం మరో కీలక సదుపాయం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ ను వీడి రావడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో వారి కోసం ప్రత్యేకంగా ఓ రైలును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు ఏర్పాటు చేసిన విందు సందర్భంలో… ఉద్యోగుల వైనాన్ని చెప్తూ, ఒక స్పెషల్ ట్రైన్ ను విజయవాడ – సికింద్రాబాద్ ల మధ్య నడపాల్సిందిగా కోరారు.
దీనికి సుముఖత వ్యక్తం చేసిన రైల్వే మంత్రి, ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. మరో పది రోజుల్లోనే అంటే నిర్దేశిత గడువు అయిన 27వ తేదీన పట్టాలేక్కే ఈ రైలును వారానికి మూడు రోజులు పాటు నడపనున్నారు. అమరావతి ఉద్యోగులకు వారానికి 5 రోజులే పని దినాలు కావడంతో వీకెండ్ లో వారంతా హైదరాబాద్ చేరుకునేందుకు ఈ రైలును వినియోగించుకోనున్నారు.
సికింద్రాబాద్ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి ఉదయానికి విజయవాడ చేరుకోగా, అలాగే అదే సమయంలో విజయవాడలోనూ రాత్రి 10 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయానికి సికింద్రాబాద్ చేరుతుందట. ఇప్పటికే ఈ రైలుకు అవసరమైన కోచ్ లను కూడా రైల్వే శాఖ సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగులను రప్పించడానికి చంద్రబాబు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావని ఈ సందర్భంగా స్పష్టంగా అర్ధమవుతోంది.