ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తహతహలాడుతున్నారు. అయితే అంత కంటే ముందు ఆయన బీజేపీని ఎందుకు ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారా? కేసీఆర్ గనుక ముందస్తుకు వెళ్లాలనుకొంటే అసెంబ్లీ రద్దుపై మంత్రివర్గంలో తీర్మానం చేసి గవర్నర్కు పంపాలి. దానిపై వెంటనే గవర్నర్ నిర్ణయం తీసుకొని ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తారు.
అసెంబ్లీ రద్దయినందున తదుపరి ఎన్నికలు నిర్వహించాలని స్పీకర్ ఎన్నికల కమిషన్కు వర్తమానం పంపే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోపు కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ రద్దు చేస్తూ తీర్మానించి గవర్నర్కు అందించినప్పటికీ ఆయన వెంటనే ఆమోదించకుండా, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు కూడా చూడొచ్చు.
.తెలంగాణలో అటువంటి పరిస్థితి లేదు కాబట్టి గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకొని తదుపరి ఎన్నికలు జరిపే వరకూ ఇప్పుడున్న ముఖ్యమంత్రినే ఆపద్ధర్మంగా కొనసాగమని కోరవచ్చు. ఇందులో ఎక్కడా కేంద్రం జోక్యం ఉండదు, వ్యవహారం అంతా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్, ఎన్నికల సంఘాల మధ్యే సాగుతుంది. అయితే కేంద్రానికి ఇష్టం లేకపోతే వారు గవర్నర్ ద్వారా ఈ ప్రక్రియను ఆలస్యం చేసి ముందస్తుకు అడ్డుపడొచ్చు.