amaravati land poolingరైతుల నుంచి ప్రభుత్వ అవసరాలకు భూమిని సేకరించాలంటే… అదో పెద్ద ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. ఇప్పటిదాకా అటు కేంద్రంతో పాటు ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ ఉన్న భావన. కానీ, నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానికి ఏకంగా 34 వేల ఎకరాల సేకరణ ఎలా సాధ్యమైంది? అది కూడా చాలా స్వల్ప వ్యవధిలో… పెద్దగా వ్యతిరేకత లేకుండానే..! అక్కడక్కడ కొంతమేర నిరసన వ్యక్తమైనా… స్వయంగా రైతులే ముందుకు వచ్చి తమ భూమిని రాజధాని నిర్మాణానికి ఇస్తున్నామంటూ సంతోషంగా అంగీకార పత్రాలు అందజేసిన ప్రక్రియను ఏపీ ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా పూర్తి చేసింది.

దీనిపై తాజాగా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. అమరావతి భూసేకరణలో రైతులే ముందుకు వచ్చి భూములిచ్చిన వైనం వెనుక ఉన్న మర్మమేమిటో తెలిస్తే… ఇతర ప్రాంతాల్లోనూ భూసేకరణ సులువవుతుంది కదా అని భావించారు కేంద్రం పెద్దలు. అనుకున్నదే తడవుగా ఓ ఉన్నత స్థాయి అధికారిని మంగళవారం నాడు అమరావతికి పంపింది కేంద్రం. హోం శాఖ అదనపు కార్యదర్శి రాజగోపాల్ కేంద్రం ఆదేశాలతో అమరావతిలో పర్యటించిన బృందం, తొలుత సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లి, ఆ తర్వాత రాజధాని గ్రామాల్లో పర్యటించారు. దీనిపై త్వరలోనే కేంద్రానికి ఓ నివేదిక అందించనున్నారు.