సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ మహారాష్ట్ర అదనపు డీజీపీగా రాజీనామా చేసిన సంగతి తెలిసింది. దానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నారా? అని సర్వత్రా ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. మొత్తానికి ఆ ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడింది.
తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదని ఆయన స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని ఆయన చెప్పారు. అయితే అప్పటిలోగా తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నాక, తన ప్రణాళికను వెల్లడిస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే సంజీవనిగా భావించే ప్రత్యేక హోదా రాష్ట్రానికి చాలా అవసరమని పేర్కొన్నారు. హోదా వస్తేనే కంపెనీలు ఇక్కడికి తరలివచ్చి రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ స్టాండ్ బట్టి ఆయన బీజేపీ వైపు లేరని దాదాపుగా ఒక అంచనాకు రావొచ్చు.