cbi-court-issued-summons-to-minister-botsa-on-volkswagen-caseగత నాలుగు రోజులుగా అమరావతి విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచిన మంత్రి బొత్స సత్యనారాయణకు అనుకోని ఇబ్బంది వచ్చి పడింది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు వ్యవహారంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు సమన్లు జారీ అయ్యాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు బొత్సకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 12న హాజరుకావాలని బొత్సకు న్యాయస్థానం సూచించింది.

అప్పటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స.. ఫోక్స్‌వ్యాగన్‌ కేసులో సంబంధం ఉంది. అప్పట్లో “ఏటి సేత్తాం… డబ్బులు పోనాయి” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బొత్స వార్తలలో నిలిచారు. ఇన్ని రోజులకు అది కూడా మంత్రిగా ఉండగా సమన్లు జారీ కావడం బొత్సకు పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. ఫోక్స్ వ్యాగన్ కంపెనీని హైదరాబాద్ నుంచీ వైజాగ్‌కి తరలించాలనే అంశంపై బొత్స, మరికొందరికి పెద్ద ఎత్తున ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చాయి.

దీనిపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకి ఆదేశించింది. విచారణ జరుగుతున్న సమయంలో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. 59మంది సాక్షులుగా ఉన్నారు. ఇప్పటికే 3వేల పేజీల ఛార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. దాదాపు రూ.7 కోట్ల వరకూ రికవరీ అవ్వగా… ఇంకా రూ.5కోట్ల 65లక్షలు రికవరీ కావాల్సి ఉంది. ఫోక్స్ వ్యాగన్‌ను తరలించేందుకు… వశిష్ట వాహన అనే నకిలీ కంపెనీని సృష్టించడం ద్వారా… దానికి పెట్టుబడులను మళ్లించడం ద్వారా పెద్ద కుట్ర జరిగిందని ఛార్జిషీట్‌లో తెలిపారు