Cash for Vote case notices to Chandrababu Naiduఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన భారీ కుట్ర జరుగుతోందని, ఇది వందకు వంద శాతం నిజమంటూ మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించి కుండబద్దలు కొడుతూ చెప్పారు హీరో శివాజీ. ఇలాంటి చర్యలు చేయడమేనా మనదేశ ప్రజాస్వామ్యం? అంటూ ప్రశ్నించిన శివాజీ, ‘ఈ ట్రాప్ లో చంద్రబాబు పడితే, దీనికి అనుబంధంగా మరో రెండు, మూడు నోటీసులు రావచ్చని’ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతానికి అయితే ఇంకో నోటీసు ఖచ్చితంగా వస్తుందని, అది ఎప్పుడు వస్తుందో చెప్పలేను గానీ, రావడానికి సిద్ధంగా ఉందంటూ తెలిపారు. ఆ నోటీసు దేనికి సంబంధించి అని మీడియా వర్గాలు ప్రశ్నించగా… అది తాను బయటకు చెప్పలేనని, ఏపీలో తనకు తగినంత భద్రత ఉందని, కానీ తన నివాసం మరో ఉందని, నోటీసుల గురించి మాట్లాడితే తనకు అక్కడ భద్రత ఉండదంటూ చెప్పకనే చెప్పారు.

బహుశా ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులు రావచ్చన్న అభిప్రాయాలను శివాజీ పరోక్షంగా వెల్లడించారు. ఈ పరిణామాలు తెలంగాణా ప్రాంతం నుండి చోటు చేసుకోబోతున్నాయన్న భావనను తన మాటల ద్వారా వ్యక్తపరిచారు శివాజీ. ఇది జరుగుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం గానీ, ముందస్తుగా శివాజీ చేసిన హెచ్చరికలు నిజం కావడంతో, ప్రస్తుతం శివాజీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వాటికి తీవ్ర ప్రాధాన్యత లభిస్తోంది.