బీజేపీ కూడా నెమ్మది నెమ్మదిగా కాంగ్రెస్ లా రూపాంతరం చెందుతుంది. కాంగ్రెస్ మార్కు సీల్డ్ కవర్ రాజకీయాలు బీజేపీలో ఇప్పుడు మొదలయ్యాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ గద్దెనెక్కిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి యెడ్డ్యూరప్ప ప్రమాణస్వీకారం తరువాత ఇరవై రోజులు దాటాక గానీ అమిత్ షా నుండి కేబినెట్ లిస్టు రాలేదు. మొత్తానికి ఈరోజు ఉదయం 17 మంది చేత గవర్నర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
వారిలో ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మిగిలిన వారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలే. సీనియర్లు అయిన జగదీశ్ శెట్టర్, ఈశ్వరప్ప, అశోక లకు యడియూరప్ప కేబినెట్లో బెర్తులు లభించాయి. ఇక గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుడు, ఎమ్మెల్యే శ్రీరాములకు కూడా కేబినెట్ బెర్త్ లభించింది. ఫిరాయింపుదారులను దారికి తెచ్చుకోవడంలో గాలి జనార్ధన్ రెడ్డి డబ్బు పవర్ గట్టిగా పనిచేసిందట. దీనితో ఆయన అనుచరుడికి పదవి ఇవ్వక తప్పలేదు.
బీజేపీకి ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది బోటాబోటీ మెజారిటీనే. ఈ నేపథ్యంలో ఆయనను ప్రసన్నం చేసుకోవాలనే బీజేపీ అభిప్రాయంతో ఉంది.దీనితో తొందరలో గాలి పై ఉన్న కేసులు కూడా కొట్టేయ్యడం ఖాయంగా కనిపిస్తుంది. అటు ఆంధ్రాలోనూ, ఇటు కర్ణాటకలోనూ అనుకూలమైన ప్రభుత్వాలు ఉండటంతో గాలి పూర్వ వైభవం తిరిగి రావడం ఖాయమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దాదాపుగా పదేళ్ళ గాలి జనార్ధనరెడ్డి కష్టాలు తీరిపోయినట్టేనా?