రాజకీయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పై పోటీ చేసి ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ కొన్ని రోజులుగా నాని టార్గెట్ చేస్తున్నారు. మూసేసిన సంస్థలో కొంత మందికి బకాయిలు చెల్లించలేదని పీవీపీ ఆరోపణ. సదరు ఎంప్లాయిస్ కోర్టుకు కూడా వెళ్ళడంతో ఈ విషయంలో పీవీపీది పై చెయ్యి అయ్యింది. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఇప్పుడు కేశినేని నానికి అవకాశం దొరికింది.
పొట్లూరి వరప్రసాద్ ఆస్తుల వేలానికి కెనరా బ్యాంకు సిద్ధం అవుతుంది. ఆయనకు చెందిన పీవీపీ కేపిటల్ లిమిటెడ్ సంస్థ భారీ మొత్తంలో రుణం తీసుకుని చెల్లించకపోవడంతో బకాయిలు 148.90 కోట్లకు చేరాయి. వాటి వసూలకు పీవీపీకి చెందిన ఆస్తులను వేలం వేయాలని బ్యాంకు అధికారులు నిర్ణయించి పత్రికా ప్రకటన కూడా జారీచేసింది. దీనితో వైఎస్సార్ కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. దీనితో పీవీపీని కేశినేని నాని టార్గెట్ చేశారు.
“అయ్యా జగన్ రెడ్డి గారు అసలే బ్యాంకుల పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు మీ సహచరుడు బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన వేలాది కోట్లను తిరిగి చెల్లించిన తరువాత శ్రీరంగ నీతులు చెప్పమనండి లేకపోతే నిమ్మగడ్డ కు పట్టిన గతే పడుతుంది,” అంటూ నాని ఎద్దేవా చేశారు. పీవీపీ కొన్ని జగన్ అవినీతి కేసులలో సహనిందితుడు అన్న విషయం తెలిసిందే. ఆయన 2014లో విజయవాడ నుండి టీడీపీ ఎంపీగా పోటీ చేద్దాం అని ప్రయత్నించినా చివరి నిముషంలో నానికి అవకాశం వచ్చింది.