ప్రత్యేక రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో బైరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తరువాత కాంగ్రెస్ లో చేరిన మరో కీలక నేత బైరెడ్డి. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి బైరెడ్డి రాజశేఖర్రెడ్డి 1994, 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గౌరు చరిత చేతిలో ఓడిపోయారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. అప్పటి వరకు ఇదే నియోజకవర్గంలో ఉన్న ఓర్వకల్లు మండలాన్ని పాణ్యం నియోజకవర్గంలో విలీనం చేశారు. దాంతో బైరెడ్డి రాజశేఖర్రెడ్డి పాణ్యం నియోజకవర్గానికి మారాల్సి వచ్చింది.
2009 ఎన్నికల్లో పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన ఉద్యమ నేపథ్యంలో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ సాధన సమితి (ఆర్పీఎస్)ను స్థాపించారు. ఇటీవలే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాకపోతే ఊమెన్ చాందీ మధ్యవర్తిత్వంతో కాంగ్రెస్ లో చేరారు.