‘శ్రీమంతుడు’ సినిమా అందించిన ఘనవిజయానికి గానూ ఉప్పొంగిన ప్రిన్స్ మహేష్ బాబు, ఆ సినిమా దర్శకుడు కొరటాల శివకు ఓ ఆడి కారును బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. సరదాగా కారు షో రూమ్ కు పిలిచి కారు కీస్ ఇవ్వడం తనను అవాక్కయ్యేలా చేసిందని దర్శకుడు కొరటాల కూడా కృతజ్ఞతలు చెప్పగా, ఆప్పట్లో ఈ ఉదంతం ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించింది. ఇలా బహుమతులు ఇవ్వడం ఇదే ప్రధమం కాకపోయినప్పటికీ, ఇటీవల కాలంలో మాత్రం ‘కారు’ వంటి కాస్ట్లీ బహుమతి ఇచ్చిన ఘనత మాత్రం ప్రిన్స్ కే దక్కింది.
అయితే తాజాగా మహేష్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూడా పయనించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో “నాన్నకు ప్రేమతో” వంటి ఒక విలక్షణమైన సినిమాను నిర్మాత ప్రసాద్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే తొలి 50 కోట్ల సినిమాగా రికార్డులకెక్కింది. కమర్షియల్ విజయం కంటే కూడా, ఒక విలక్షణమైన సినిమాగా, చిత్ర యూనిట్ కు మంచి కీర్తి ప్రతిష్టతలను తెచ్చిపెట్టింది.
ఈ ఖ్యాతికి ఉప్పొంగిన నిర్మాత ప్రసాద్ తాజాగా సుకుమార్ కోసం ఓ ‘బిఏండబ్ల్యూ’ కారును బహుమతిగా అందజేయడం విశేషం. ‘బిఏండబ్ల్యూ’ సిరీస్ లో దాదాపు 50 లక్షల విలువ గల ‘ఎక్స్ 3’ మోడల్ కారును బహుమతి అందించారు. చూడబోతుంటే… దర్శకులకు కార్లను బహుమతిగా ఇవ్వడం టాలీవుడ్ లో సరికొత్త ‘ట్రెండ్’గా కనపడుతోంది. ఏది ఏమైనా… ప్రతిభకు ఈ విధంగా పట్టం కట్టడం కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే.