సినీ నిర్మాత బన్నీ వాసు తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని సినీ జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ తనకు తానుగా ఫిలింనగర్లోని ఫిలిం ఛాంబర్ ఎదుట గేటుకు ఇనుప గొలుసులతో బంధించుకున్న ఘటన ఇటీవల కలకలం రేపింది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమె చేస్తున్న ఆరోపణలను ఖండించి, ఆమెపై ఇప్పటికే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాం అని ప్రకటించింది గీతా ఆర్ట్స్.
అది అలా ఉండగా మొట్టమొదట సారి ఆ విషయంపై స్పందించారు బన్నీ వాసు. “జూనియర్ ఆర్టిస్ట్ సునీత సినిమాల్లో అవకాశాలు ఇప్పించమని కోరిన మాట వాస్తవమే. నేను కూడా నాకు తెలిసిన వారికి ఆమె గురించి చెప్పి ఏమైనా అవకాశాలు ఉంటే చెప్పమన్నాను.ఎవరైనా సినిమాల్లో అవకాశాలు పొందాలంటే ఆడిషన్స్లో పాల్గొని, ఎంపికవ్వాలి. అంత తప్ప వేరే దారి లేదు. బోయ సునీత ప్రవర్తన వల్లే మేము తనకు క్యారెక్టర్స్ ఇవ్వలేకపోయాము. అంతే తప్ప మరే ఇతర కారణాలు లేవు.’ అని ఆయన పేర్కొన్నారు.
బన్నీ ఫ్రెండ్ గా ఇండస్ట్రీకి వచ్చిన బన్నీ వాసు తొలుత చిత్ర పంపిణీరంగంలో ప్రయత్నించి చెయ్యి కాల్చుకున్నారు. ఆ తరువాత బన్నీ వాసు గీతా ఆర్ట్స్ మరో బ్యానర్ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే, అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలను నిర్మిస్తున్నారు. మరిన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆయన జనసేన పార్టీకి ఉభయగోదావరి జిల్లాలలో తెరవెనుక సాయం అందించారు. పాలకొల్లు టిక్కెట్ కోసం చివరి నిముషం వరకూ ప్రయత్నాలు చేశారు. అయితే కొన్ని చివరి నిముషం సమీకరణాల వల్ల ఆయనకు టిక్కెట్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ కు సాధ్యపడలేదు.