bsnl-plans-free-voice-cheaper-package-than-jioకనెక్షన్ తీసుకుంటే చాలు… అద్దె లేకుండా ఉచితంగా మాట్లాడుకోండనేలా ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ మరే టెలికం కంపెనీ ఇవ్వలేని ఆఫర్ ను సిద్ధం చేసింది. ఇప్పటికే రిలయన్స్ జియోకు సైతం షాకిస్తూ, 249 రూపాయలకే అపరిమిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రకటించిన బీఎస్ఎన్ఎల్, ఇప్పుడు దిమ్మతిరిగే ఆఫర్ ను ప్రకటించనున్నట్లు సమాచారం.

ప్రీ-పెయిడ్ వినియోగదారులు వాడుకునేలా 2జీ, 3జీ కస్టమర్లకు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని, కేవలం నామమాత్రంగా 2 నుంచి 4 రూపాయలు మాత్రమే ఉంటుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా, 2జీ, 3జీ వినియోగదారులు ఉచిత కాల్స్ ను ఏ నెట్ వర్క్ కైనా చేసుకోవచ్చని సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

తొలి దశలో సంస్థ నెట్ వర్క్ మెరుగ్గా ఉండే హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఒడిసా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ఆఫర్ ను తీసుకువస్తామని, ఆపై దేశవ్యాప్తంగా అమలు చేస్తామని వివరించారు. జియో ఆఫర్లు 4జీ సపోర్ట్ చేసే ఫోన్ల పైనే పని చేయనున్న నేపధ్యంలో… ఈ బీఎస్ఎన్ఎల్ ఆఫర్ సాధారణ ప్రజానీకంలో విపరీతంగా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.

ఈ ఆఫర్ ను గనుక అమలు చేస్తే, ఇండియాలోని ఏ మొబైల్ ఫోన్ నుంచైనా బీఎస్ఎన్ఎల్ సిమ్ తో ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే, అతి తక్కువ చార్జ్ లతో మరో ఇంటర్నెట్ ప్యాక్ తో బండిల్డ్ రూపంలో తీసుకు రావచ్చని టెలికం నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఒక్క ‘జియో’ దెబ్బకు మొత్తం టెలికం రంగం అంతా కుదేలవుతోంది.