brahmotsavam audio launch in andhra pradesh“బ్రహ్మోత్సవం” సినిమా షూటింగ్ ను హరిద్వార్, ఉదయ్ పూర్ లలో పూర్తి చేసుకుని, హైదరాబాద్ కు చేరుకున్నామని, మరికొన్ని సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని… ప్రిన్స్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో, ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని ఖరారయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

సమ్మర్ కానుకగా మేలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియో వేడుక, తేదీ రెండూ ఖరారయ్యాయి. ఏప్రిల్ 23వ తేదీన ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరిగే ఆ ఏడుకొండలపై నిలయమై ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి తిరుపతిలో ఈ “బ్రహ్మోత్సవం” ఆడియో కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ఈ ఆల్బమ్ వేడుక నిర్వహణకే దాదాపు 2 నుండి 3 కోట్ల రూపాయలను నిర్మాత పివిపి వెచ్చించనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ వేడుకను నిర్వహించే బాధ్యతలను శ్రేయాస్ మీడియా సంస్థకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.

ఈ సమాచారంతో సోషల్ మీడియాలో ప్రిన్స్ ఫ్యాన్స్ సందడి కూడా ప్రారంభమైంది. ప్రిన్స్ సినిమాల ఆడియోలు ఎప్పుడూ హైదరాబాద్ లో జరుగుతుంటాయి. కానీ, తొలిసారిగా ఓ బహిరంగ ప్రదేశం… అది కూడా తిరుపతిలో ఖరారు చేయడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 23వ తేదీన ఆడియో విడుదల కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు తన సొంతూరు, దత్తత తీసుకున్న గ్రామం అయినటువంటి బుర్రిపాలెంను కూడా సందర్శించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.