Nara -Lokesh - Nara - Brahmini -Nara Devanshమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనువడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కుమారుడు దేవాన్ష్‌ మరియు లోకేష్ సతీమణి బ్రాహ్మణి హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించి అందరిని ఆశ్చర్యపరిచారు. జూబ్లీహిల్స్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు ప్రయాణం చేశారు. దీంతో మిగతా ప్రయాణికులు వారితో ఆసక్తిగా కరచాలనం చేసి సెల్ఫీలు దిగారు.

అయితే ఆ తర్వాత కొంత వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కొందరు తీసిన వీడియోలను భద్రతా సిబ్బంది సెల్‌ఫోన్‌ నుంచి తొలగించారు. దానిని వారు ఖండించారు. భద్రతా సిబ్బంది తో వాగ్వాదానికి దిగారు. అయితే బ్రాహ్మణి కలగజేసుకుని సర్ది చెప్పడంతో గొడవ సర్దుమణిగింది. బ్రాహ్మణి గత కొంతకాలంగా అత్తమ్మ భువనేశ్వరికి తోడుగా హెరిటేజ్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.

దీనితో గత అయిదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ లు అమరావతి లో మకాం వేసినా బ్రాహ్మణి, భువనేశ్వరి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. దేవాన్ష్‌ కోసం చంద్రబాబు, లోకేష్ అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి పోతుండేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటంతో కుటుంబానికి ఎక్కువ సమయం ఇచ్చే అవకాశం కలిగింది. చంద్రబాబు చేతి సమస్యకు వైద్యులు బెడ్ రెస్టు చెప్పడంతో ప్రస్తుతం కుటుంబమంతా హైదరాబాద్ లోనే ఉంది.