సముద్రానికి – కృష్ణానది సంగమానికి నిలయమైన హంసలదీవి ప్రాంతం జిల్లాలోని చుట్టుప్రక్కన ప్రాంతాల వారికే ఎక్కువగా పరిచయం. కానీ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన “జయ జానకి నాయక” సినిమా విడుదలైన తర్వాత… ‘హంసలదీవి ఇంత అందంగా ఉంటుందా’ అనిపించేలా చూపించారు. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకోకపోవడంతో, హంసలదీవిని సినిమాలో చూసిన వారందరికీ చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది.
ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు శ్లోకం ద్వారా ప్రారంభమైన విజువల్స్ లో… తొలుత నదీ సంగమ ప్రాంతాన్ని బోయపాటి అద్భుతంగా చూపించారు. బహుశా డ్రోన్ కెమెరాతో దీన్ని షూట్ చేసారో ఏమో గానీ, ఆ విజువల్స్ లోనే అద్భుతమైన ఫైట్ ను చిత్రీకరించారు. సెకండాఫ్ లో హైలైట్స్ గా నిలిచిన సన్నివేశాలలో ప్రధానంగా నిలిచిన ఈ ఫైట్ లో ‘బాహుబలి’ మాదిరి రౌడీ తలకాయ నరికివేసే సన్నివేశం ఉండడం విశేషం.
ఈ సన్నివేశానికి ఒక్క ప్రేక్షకులే కాదు, రాజకీయ నాయకులు కూడా ఫిదా అయ్యారన్న విషయం బయటకు వచ్చింది. “పవిత్ర సాగర సంగమ క్షేత్రాన్ని బోయపాటి శ్రీను అద్భుతంగా తెరకెక్కించారని, ఈ సినిమా ద్వారా దివిసీమకు మరింత ప్రాచుర్యం కలుగుతుందని, దివిసీమ విశిష్టతను ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసే అవకాశం లభించిందని” ఏపీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు.