Bonda-Uma  వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య ‘అవినీతి కేసుల యుద్ధం’ నడుస్తుంది. ఒక వైపు చంద్రబాబుని ఏదో రకంగా కేసులలో ఇరికించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంటే, జగన్ కేసుల విషయంలో అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ చూస్తుంది.

అమరావతిలో భూముల ఇన్సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం పది మంది సభ్యులతో ఒక సిట్ ఏర్పాటు చేసింది. అయితే రస్ ఆల్ ఖైమా కేసు నుంచి దృష్టి మారల్చేందుకే సిట్ ఏర్పాటు చేశారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ రస్ ఆల్ ఖైమా తో జగన్ కాళ్లబేరానికి దిగారని ఆరోపించారు.

రూ. 800 కోట్లు చెల్లించేందుకు సీఎం జగన్ తన ఎంపీలను ఆ దేశం పంపారన్నారు. రస్ ఆల్ ఖైమా విషయంలో వైసీపీ నేతలు ఎందుకు కిక్కురుమనడం లేదని ప్రశ్నించారు. జగన్‌ను నేరస్థుల ఒప్పందంలో భాగంగా ఆ దేశానికి జగన్‌ను అప్పగించే పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

వాన్ పిక్ ప్రాజెక్ట్ లో కీలక పార్టనర్ రస్ ఆల్ ఖైమా అనే దేశం. ఉద్దేశపూర్వకంగా నిమ్మగడ్డ ప్రసాద్, జగన్ ఆ ప్రాజెక్టులో అవకతవకలతో తమకు భారీ నష్టం చేకూర్చారని ఆ దేశం వాదన. దానితో తమ అంతర్జాతీయ ప్రాబల్యంతో నిమ్మగడ్డని సెర్బియాలో అరెస్ట్ చేయించారు. ఆయనకు అక్కడ బెయిలు వచ్చినా దేశం విడిచి వెళ్లకూడదని ఆంక్షలు ఉన్నాయి.