జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో నిన్న అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని పావలా అని సంబోధిస్తూ… “పావలాకు అసలు కరోనా పాజిటివ్ వచ్చిందా, వస్తే మూడ్రోజుల్లోనే నెగెటివ్ ఎలా అయింది?,” అంటూ సందేహం వ్యక్తం చేశారు. దీనిపై జనసైనికులు పెద్ద ఎత్తున విమర్శించారు.
ఈ విషయంగా జనసేన సీనియర్ నాయకుడు సత్య బొలిశెట్టి తీవ్ర పదజాలంతో స్పందించారు. “చాలామంది సాయిరెడ్డి గారి ట్వీట్లపై స్పందించమన్నారు. సాయిరెడ్డి శ్రీరెడ్డిల వ్యాఖ్యలకి స్పందన అవసరమా? ఏనాడో వేమనగారన్నారు చెప్పు తిన్న కుక్క చెఱకు తీపెరుగునా? అని చిప్ప కూడు తిన్న కుక్కలకీ నిజాయితీ విలువ తెలియదు అందుకే @PawanKalyan గారిపై ట్వీట్లు పెడుతుంటాయి వదిలేయండి ప్లీజ్..,” అంటూ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.
సత్య బొలిశెట్టి వ్యాఖ్యలను జనసైనికులు స్వాగతిస్తున్నారు. అయితే ఈ క్రమంలో జనసేన పార్టీలోని ఒక ప్రధానమైన లోపం చర్చకు రావడం లేదు. పవన్ కళ్యాణ్ పై ఎవరైనా విమర్శలు చేస్తే.. అందుకు వెంటనే రెస్పొండ్ అయ్యే వ్యక్తులు పార్టీలో కరువయ్యారు.
ఒకరిద్దరు స్పందించినా వారు మీడియా కవరేజ్ రాబట్టుకోగల నేతలు కాకపోవడంతో పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. ఇది జనసేనకు ప్రధాన సమస్యగా మారుతుంది. దీనిపై పవన్ కళ్యాణ్ వెంటనే దృష్టిపెట్టి సవరించకపోతే పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవు.