తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ జరుగుతుంది. పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు నమోదు అవుతున్నాయని మీడియా, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. రొటీన్ గా ఆరోపణలు కాకుండా కెమెరా ముందు అలా ఓట్లు వెయ్యడానికి వచ్చిన వారిని పట్టుకుంటున్నారు. తాము తెచ్చుకున్న ఓటర్ కార్డులు, ఓటర్ స్లిప్లలోని పేరులు కూడా సరిగ్గా చెప్పలేక తడబడుతున్నారు.
ట్రావెల్స్ బస్సులలో సైతం ఓటర్లను తరలించడం, వారిని ఒక మంత్రికి చెందిన ఫంక్షన్ హాల్ లో పెట్టడం లైవ్ లో దొరికినా అసలు అటువంటిది ఏమీ జరగడం లేదని కళ్ళు మూసుకుంది ప్రభుత్వ యంత్రాంగం అలాగే ఎన్నికల కమిషన్. అది సరిపోదు అన్నట్టు…. తిరుమల దర్శనం కోసం ప్రైవేట్ బస్సుల్లో వచ్చిన భక్తులను టీడీపీ అడ్డుకుంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్కు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
అయితే అప్పటికే ఓట్లు వేసేసి తిరిగి వెళ్తున్న సదరు ఓటర్ల వేళ్ళ మీద ఎన్నికల ఇంకు ఎందుకు ఉందని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయారు. కొందరు స్థానిక ఎన్నికల ఇంకు అని బుకాయించినా తిరుపతి ఉపఎన్నికలకు స్థానిక ఎన్నికలకు ఇంకు వేసిన వేలి మీద కాకుండా ఇంకో వేలు మీద వెయ్యడం తో అది కూడా అబద్ధమని తేలిపోయింది.
వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అంతటితో ఆగకుండా పట్టుబడిన దొంగ ఓటర్లు టీడీపీ కి ఓటు వెయ్యడానికి వచ్చారని కొత్త పల్లవి అందుకున్నారు. ఒక పార్టీ అధికారంలో ఉండి… ప్రతిపక్ష పార్టీ దొంగ ఓట్లు వేయిస్తుంది అందుకు ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుంది అని అంటే నమ్మే పరిస్థితి ఉంటుందా?