YS Sharmila - ABN RK- Vemuri Radha Krishnaమొన్న ఆ మధ్య అన్న ని ధిక్కరించి తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతుందంటూ వార్త ప్రసారం చేసింది ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి. అది పెద్ద దుమారమే రేపింది. రెండు రోజుల తరువాత షర్మిల పేరుతో ఒక ప్రెస్ నోట్ విడుదల అయ్యింది. పెద్దగా వివరాల్లోకి పోకుండా ఆ ప్రెస్ నోట్ లో కుటుంబ వ్యవహారాల పై రాయడం నీతి బాహ్యమైన చర్య అంటూ ఉంది.

దీనికి ఈ వారం వీకెండ్ విత్ ఆర్కే లో రాధాకృష్ణ వివరణ ఇచ్చారు. “ఎవరో తయారుచేసిన ప్రకటనపై షర్మిల అయిష్టంగా సంతకం చేసినట్టుగా ఆ ప్రకటనను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. నేను రాసినవి అసత్యాలని అటు శ్రీమతి విజయలక్ష్మి గానీ, ఇటు షర్మిల గానీ బైబిల్‌ పట్టుకుని చెప్పగలరా? అలా చెప్పిన రోజు నేను బహిరంగంగా క్షమాపణ చెబుతాను,” అంటూ ఆర్కే చెప్పుకొచ్చారు.

బైబిల్ మీద విజయమ్మ, షర్మిలకు ఉన్న విశ్వాసం గురించి రాష్ట్రమంతా తెలిసిందే. వారు తరచుగా సువార్త సభలకు కూడా వెళ్తూ ఉంటారు. ఎన్నికల ప్రచారం లో కూడా బైబిల్ పట్టుకునే చేసే వారు. వారుగనుక నిజంగా ప్రమాణం చేస్తే ఈ వార్తని మొక్కలోనే తుంచేసినట్టే. అలాగే ఏబీఎన్ రాధాకృష్ణ పరువు తీసేయ్యొచ్చు.

షర్మిల పార్టీ పెట్టడం ఖాయమని… ఇప్పటికే రిజిస్టర్ కూడా చేశారని ఒకప్పటి వైఎస్ సన్నిహితుడు సబ్బం హరి చెప్పుకొచ్చారు. వైఎస్‌ సన్నిహితులతో అనిల్ ఇప్పటికే‌ మంతనాలు చేశారని అన్నారు. 2014 నుంచే జగన్‌-షర్మిల మధ్య అగాథం ఉందని, రెండో పవర్‌ సెంటర్‌ ఉండకూడదనే షర్మిలతో దూరం పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు.