black money in indiaనల్లధనం వెల్లడిలో భాగ్యనగరం మొదటి స్థానంలో నిలిచింది. నగర కుబేరులు ఏకంగా 13వేల కోట్ల అక్రమ ఆదాయాన్ని ప్రకటించి అందిరికీ షాకిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్)కు దేశవ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. పన్ను చెల్లించని ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ప్రభుత్వం సెప్టెంబరు 30 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.

దీంతో పన్ను చెల్లించని అక్రమ ఆదాయాన్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వెల్లడించారు. మొత్తంగా 65,250 కోట్ల నల్లధనం వెలికి రాగా అందులో 29,362 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరనున్నట్టు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శనివారం పేర్కొన్నారు. కాగా ఈ మొత్తం సొమ్ములో హైదరాబాద్ కుబేరులదే అత్యధిక వాటా కావడం విశేషం.

శుక్రవారం సాయంత్రం వరకు హైదరాబాద్ నుంచి దాదాపు 13 వేల కోట్ల అప్రకటిత ఆదాయం వెల్లడైనట్టు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో 8,500 కోట్లతో ముంబై నిలవగా 6వేల కోట్లతో ఢిల్లీ, 4వేల కోట్లతో కోల్‌కతా ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి.