ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ గా ప్రకటించిన నాటి నుండీ బీజేపీ కంప్లీట్ గా మూడు రాజధానులకు అనుకూలమైన స్టాండ్ తీసుకుంది. అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్నారు అంటూ ఇప్పటికే ఇద్దరు పార్టీ నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేసి తన వైఖరేంటో స్పష్టం చేశారు వీర్రాజు.
నష్టనివారణా చర్యో లేదా మరొకటో తెలీదు గానీ ఆ పార్టీ జాతీయ నేత రామ్ మాధవ్ ప్రపంచంలో… దేశంలో ఎక్కడా లేనట్టుగా ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. నాలుగు రెట్లు ఉన్న యూపీకి ఒకటే రాజధానిగా లక్నో ఉందని.. అయినా అక్కడి నుంచి పరిపాలన సాగడం లేదా అని ప్రశ్నించారు.
నాడు అమరావతి అవినీతిపై ప్రశ్నించామని.. ఇప్పుడు మూడు రాజధానుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అదే సమయంలో అమరావతి రైతులకు న్యాయం జరిగేలా మన పోరాటాలు ఉండాలన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులనేవి అవినీతికి ఆలవాలం కాకుండా.. అమరావతి రైతులకు నష్టం జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ఉందన్నారు.
అమరావతి, మూడు రాజధానుల విషయం పై పూటకో మాట… నోట ఒక మాట అన్నట్టుగా మాట్లాడితే అన్ని ప్రాంతాల వారినీ మెప్పించగలం అని బీజేపీ వారు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఇటువంటి వైఖరి వల్ల ఒక్కోసారి ఎవరికీ కాకుండా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. బీజేపీ సరిగ్గా అదే బాటలో పయనిస్తోంది. ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా?