విభజన సమయంలో అయిదేళ్ళు కాదు, పదేళ్ళు, పదిహేనేళ్ళ పాటు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం, తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పది, పదిహేనేళ్ళ పాటు ‘స్పెషల్ స్టేటస్’ని అమలు చేస్తామని పార్లమెంట్ వేదికగా స్వయంగా వెంకయ్య నాయుడు గారే వెల్లడించిన మాటలను బహుశా ఏపీకి చెందిన ప్రజలెవరూ మరచి ఉండరు. మరి అధికారం వచ్చాక ఏమైందో గత రెండేళ్ళుగా చూస్తూనే ఉన్నాం. తొలిసారి ఇతర రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి అన్నారు, మరొకసారి నీతి అయోగ్ నివేదిక రావాలి అన్నారు, ఇంకోసారి అటార్నీ జనరల్ అభిప్రాయం… ఇలా చెప్పుకుంటూ పోతే వెంకయ్య గారి వీరగాధలకు లెక్కేలేదు.
ఈ కధలన్నీ అయిపోగా, గత ఆరు మాసాలుగా పునర్విభజన చట్టంలో పొందుపరచలేదు గనుక సాధ్యం కాదు, విభజన చట్టంలో ఉన్న అంశాలను మాత్రమే అమలు చేస్తాం… అనే కొత్త రాగాన్ని ఆలపిస్తున్నారు. ఇలా ప్రతి సందర్భంలో ఏపీ ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని పక్కదోవ పట్టించే విధంగా ఏదొక కారణాలతో మీడియా ముందుకు వస్తున్న సదరు కేంద్రమంత్రివర్యులు తాజాగా రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై సుదీర్ఘ ప్రసంగం చేసారు. ప్రతిసారి కారణాలే చెప్తే ‘కిక్’ ఉండడం లేదని భావించారో ఏమో గానీ, ఈ సారి కారణాలకు తోడు కాస్తంత ‘ఎటకారం’ కూడా జోడించి, సన్నివేశాలను పండించారు.
ఏపీ ప్రజల కష్టాలు తనకు తెలుసునని ఆరంభించిన వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టే క్రమంలో ఏపీ ప్రజల అభిప్రాయాలను హేళన చేసే విధంగా ప్రసంగించడం విశేషం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మనసులో ఉందన్న సంగతిని తాను కూడా అంగీకస్తానని, అయితే అది చట్టంలో లేనప్పుడు తాము మాత్రం ఏం చేయగలమని కాంగ్రెస్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేసారు. ప్రాథమికంగా కాంగ్రెస్ తప్పులు చేస్తే… వాటిని తాము సరిదిద్దుతున్నామని, అయినా మనసులో ఉన్న కోరికలు చట్టాలు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలని ఎటకారంతో కూడిన వ్యాఖ్యలు చేసారు.
వెంకయ్య నాయుడు గారు ఎక్కుపెట్టిన అస్త్రాలు కాంగ్రెస్ పార్టీ వైపే కావచ్చు, కానీ అవి ఏపీ ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై కావడంతో, కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఆ ‘ఎటకారపు మాటలు’ ఏపీ ప్రజలకు తగిలాయి. అయినా ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన సీరియస్ విషయంపై ‘వెటకారపు మాటలను ఎవరూ సహించలేరు. అది కాంగ్రెస్ పార్టీ అయినా..! నాడు ఎన్నికల ప్రచారంలో మనసులో ఒకటి పెట్టుకుని, బయటకు మరొకటి మాట్లాడిన వైనం కూడా కేంద్రమంత్రివర్యులు గుర్తుంచుకోవాలని చెప్తూ సోషల్ మీడియాలో వెంకయ్య గారి వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.
నాడు, నెల్లూరు వేదికగా మోడీ సమక్షంలో వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో ప్రధానంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఒక్క మీ వెంకయ్య నాయుడు గారి వలనే సాధ్యం అన్న సదరు వీడియోకు జవాబు ఎవరు చెప్తారు? ఆ వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీనా? లేక తర్జమా చేసిన వెంకయ్య నాయుడునా? రాజకీయాల్లో ఎటకారం సహజమే. గతంలో ఎన్నో సందర్భాలలో వెంకయ్య నాయుడు గారు ఎటకారం ప్రజల చేత నవ్వులు పూయించింది. అయితే, దానికి కూడా సమయం, సందర్భం ఉండాలి. అలా కాకుండా, క్లిష్టమైన అంశాలలో తమ వాక్చాత్యుర్యాన్ని ప్రదర్శించాలని వారనుకుంటే… ప్రజలు తమ వంతు వచ్చినపుడు వారి ‘ఓటు’ చాతుర్యాన్ని ప్రదర్శిస్తే… అప్పుడు ఆ వాక్చాతుర్యానికి విలువ లేకుండా పోతుందన్న విషయాన్ని గుర్తించాలి.
రాని స్పెషల్ స్టేటస్ కి క్రెడిట్ మాత్రం @MVenkaiahNaidu దే – @narendramodi pic.twitter.com/Wq9PO0JfNL
— Nellore PeddaReddy (@Tenali_RK) July 28, 2016